వాస్తవ తనిఖీ : వరదనష్టం వద్దంటూ ఎన్నికల కమిషన్కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాయలేదు, వైరల్ పోస్ట్ అబద్ధం
వైరల్ దావా నకిలీ. ఎలక్షన్ కమిషన్కు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాయలేదు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని ధృవీకరించారు.
- By Vishvas News
- Updated: November 28, 2020

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని నిలిపేయాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అవుతోంది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఆ లేఖ నకిలీ అని తేలింది. హైదరాబాద్లో ప్రజలకు పంపిణీ చేస్తున్న వరద సాయం నిలిపేయాలంటూ బండి సంజయ్ లేఖ రాయలేదు.
దావా :
వాట్సప్లో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ వైరల్ పోస్ట్లో రెండు లెటర్లతో ఒక ఇమేజ్ ఉంది. ఆ ఫోటో కింద ‘బయటపడ్డ బండి సంజయ్ భాగోతం. ఆపదలో ఉన్న వరద బాధితులకు పదివేలు ఇచ్చే వాటిని కేంద్ర ఎన్నికల కమిషనర్కి లేఖ రాసి అడ్డుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పేదల నోట్లో మట్టి కొట్టిన బిజెపి.’ అని వ్యాఖ్య రాశారు. ఆ వైరల్ పోస్ట్లో ఉన్న రెండు లేఖలు పరిశీలిస్తే.. వరద సాయం నిలిపివేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాసిన లేఖ, ఆ పక్కనే బండి సంజయ్ పేరుతో రాసిన లేఖ ఉన్నాయి.

ఇటీవల హైదరాబాద్ను వరదలు ముంచెత్తాయి. తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. దీంతో, బాధితులకు పదివేల రూపాయల చొప్పున వరద సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వరదసాయం పంపిణీ కొనసాగుతోంది. అయితే, ఈ సమయంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న వరదసాయం పంపిణీ నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో, చాలా మంది ఈ ఫోటోను ఇదే వాదనతో సోషల్ మీడియాలో వైరల్ షేర్ చేశారు.
దర్యాప్తు :
బండి సంజయ్ రాసినట్లుగా ఉన్న లేఖ అనుమానాస్పదంగా కనిపించింది. తొలుత ఆ లేఖను నిశితంగా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో ప్రధానంగా మూడు లోపాలు కనిపించాయి.
- జీహెచ్ఎంసీ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఇది పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో జరిగే ప్రక్రియ. కానీ, బండి సంజయ్ రాసిన లేఖ.. కేంద్ర ఎన్నికల కమిషనర్కు అడ్రస్ చేశారు. అంటే.. అవగాహన లేకుండా రూపొందించిన ఫేక్ లెటర్గా అర్థమవుతోంది.
- ఏ లేఖలో అయినా తేదీ రాయడం పరిపాటి. అధికారిక లేఖలకు తప్పనిసరి. ఈ లేఖలో ఏ రోజు రాశారో ప్రస్తావన లేదు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన లెటర్ హెడ్లో ఆ ప్రస్తావన కూడా ఉండాలి. కానీ, ఈ తప్పుడు లేఖలో ఆప్రస్తావన లేదు.
విశ్వాస్ న్యూస్ ఈ అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేసింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్, కీ వర్డ్స్ ఆధారంగా ఇంటర్నెట్లో శోధించాము. అప్పుడు మాకు ట్విట్టర్లో ఈ ఫోటోతో ఓ రిక్వెస్ట్ కనిపించింది. ఇది నిజమా ? అని ట్విట్టర్ యూజర్ ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో తిరుగుతున్న లేఖ తాను రాయలేదని, తన సంతకం ఫోర్జరీ చేశారని బిజెపి అధ్యక్షుడు బండిసంజయ్.. ఆ మరుసటిరోజే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు కాపీని తెలంగాణ డీజీపీకి, కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా పంపించారు. ఆ ఫిర్యాదు కాపీని కింద చూడవచ్చు.

అలాగే, బీజేపీ తెలంగాణ కమిటీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ ట్విట్టర్లో ఏముందో కింద చూడొచ్చు.
చివరగా విశ్వాస్ న్యూస్ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ని సంప్రదించింది. ఆ లేఖ తాను రాయలేదని, ఇదే అంశంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.
निष्कर्ष: వైరల్ దావా నకిలీ. ఎలక్షన్ కమిషన్కు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాయలేదు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని ధృవీకరించారు.
- Claim Review : 'బయటపడ్డ బండి సంజయ్ భాగోతం. ఆపదలో ఉన్న వరద బాధితులకు పదివేలు ఇచ్చే వాటిని కేంద్ర ఎన్నికల కమిషనర్కి లేఖ రాసి అడ్డుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పేదల నోట్లో మట్టి కొట్టిన బిజెపి.'
- Claimed By : whatsapp User
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com